Telugu Global
Sports

భారత మహిళా క్రికెట్‌లో సంచలనం, 33 ఏళ్ల వ‌య‌స్సులో అంత‌ర్జాతీయ‌ క్రికెట్ టీంలోకి..

భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీద‌గా శోభ‌న టీమిండియా క్యాప్ అందుకుంది. వీటన్నింటి కన్నా చెప్పుకోదగిన విషయం 33 ఏళ్ల వ‌య‌స్సులో ఆమె అంత‌ర్జాతీయ‌ అరంగేట్రం చేయ‌డం.

భారత మహిళా క్రికెట్‌లో సంచలనం, 33 ఏళ్ల వ‌య‌స్సులో అంత‌ర్జాతీయ‌ క్రికెట్ టీంలోకి..
X

భారత జ‌ట్టు త‌ర‌పున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాల‌నుకున్న కేర‌ళ స్పిన్న‌ర్ ఆశా శోభ‌న కల నేర‌వేరింది.సిల్హెట్ వేదిక‌గా బంగ్లాదేశ్ మ‌హిళ‌ల‌తో జ‌రుగుతున్న‌ నాలుగో టీ20లో శోభ‌నకు చోటు దక్కింది.

భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీద‌గా శోభ‌న టీమిండియా క్యాప్ అందుకుంది. వీటన్నింటి కన్నా చెప్పుకోదగిన విషయం 33 ఏళ్ల వ‌య‌స్సులో ఆమె అంత‌ర్జాతీయ‌ అరంగేట్రం చేయ‌డం. దీంతో భారత మహిళా జ‌ట్టు తరఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అతిపెద్ద వయసులో అరంగేట్రం చేసిన మహిళగా ఆశా శోభ‌న రికార్డుల్లో నిలిచారు.

ఈ క్రమంలో 31 ఏళ్ల వయసులో భారత్ తరఫున అరంగేట్రం చేసిన సీమా పూజారే రికార్డును బద్దలు కొట్టారు. సీమ 2008లో రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో అంతర్జాతీయ క్రికెట్ లో దిగారు.


13 ఏళ్ల వ‌య‌స్సులోనే క్రికెట్ వైపు తొలి అడుగు

కేరళ రాజధాని త్రివేండ్రంలో 1991లో జన్మించిన ఆశా పేదరికంతో పోరాడుతూనే ఆమె క్రికెట్ పై దృష్టి పెట్టింది. తన 13 ఏళ్ల వయసులో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆశా శోభన తర్వాత సీనియర్ జట్టుకు ఆడింది.

దేశీయ క్రికెట్‌లో కేరళ, పుదుచ్చేరి, రైల్వేస్ జట్ల‌కు ప్రాతినిధ్యం వహించింది. కేర‌ళ త‌ర‌పున అద్భుతంగా రాణించ‌డంతో భార‌త-ఏ జ‌ట్టులో చోటు ద‌క్కింది. గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తున్నా.. భారత జాతీయ జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్కించుకోలేక‌పోయింది.

భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌ను ఆద‌ర్శంగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న శోభనను డబ్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో బెంగళూరు (RCB) రూ. 10 లక్షలకు తీసుకుంది. తొలి సీజ‌న్‌లో పెద్ద‌గా రాణించని శోభన.. డ‌బ్ల్యూపీఎల్ 2024లో అదరగొట్టింది. 10 మ్యాచ్‌ల్లో 7.11 ఏకాన‌మితో 12 వికెట్లు తీసింది.

ఈ క్ర‌మంలో భార‌త సెల‌క్ట‌ర్లు నుంచి ఆశాకు పిలుపు వ‌చ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ మ‌హిళ‌ల‌ల‌తో జ‌రుగుతున్న‌ నాలుగో టీ20లో శోభన ఆట మొదలయ్యింది. శోభన అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 56 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ఎడతెగని వర్షం, వడగళ్ల వాన కారణంగా మ్యాచ్‌ ఫలితాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ప్రకటించారు.

First Published:  7 May 2024 7:49 AM GMT
Next Story