Telugu Global
Sports

లక్షవేల కోట్లకు పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ!

భారత క్రికెట్ బోర్డు సృష్టి ఐపీఎల్ బ్రాండ్ విలువ సీజన్ సీజన్ కు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తోంది. గత 18 సీజన్లలో 433 రెట్లు బ్రాండ్ విలువ పెరిగింది.

లక్షవేల కోట్లకు పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ!
X

భారత క్రికెట్ బోర్డు సృష్టి ఐపీఎల్ బ్రాండ్ విలువ సీజన్ సీజన్ కు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తోంది. గత 18 సీజన్లలో 433 రెట్లు బ్రాండ్ విలువ పెరిగింది....

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు 2008 సీజన్లో ప్రారంభించిన ఐపీఎల్ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ పోతోంది. సీజన్ సీజన్ కూ బ్రాండ్ విలువ రికార్డుస్థాయిలో పెరిగిపోతూ వస్తోంది.

17 సీజన్లలో 433 రెట్లు పెరిగిన విలువ...

2008లో ప్రారంభమైన ఐపీఎల్ బ్రాండ్ విలువ 2023 సీజన్ నాటికి 433 రెట్లు పెరిగినట్లు, ' డెకాకోర్న్' స్థాయికి చేరినట్లు బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

గతేడాది కాలంలో బ్రాండ్ విలువ 28 శాతం పెరగడంతో 10.7 బిలియన్లు ( షుమారు లక్ష వేల కోట్ల రూపాయల) స్థాయికి చేరినట్లు బ్రాండ్ ఫైనాన్స్ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా డజనుకు పైగా వేదికల్లో నిర్వహిస్తున్న 2024 సీజన్ ఐపీఎల్ మ్యాచ్ లకు అభిమానులు పోటెత్తుతూ ఉండటం, భారీస్క్ర్రీన్ల ముందు భారీగా గుమికూడటంతో ఐపీఎల్ నిర్వాహక మండలి ఉక్కిరిబిక్కిరవుతోంది.

2008 లో మొదలైన ఐపీఎల్ బ్రాండ్ విలువ 2024 నాటికి 433 శాతం మేర పెరిగినట్లు వివరించింది. అంతర్జాతీయ క్రికెట్లో వివిధ దేశాలు నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్ లకు ఐపీఎల్ చుక్కానిలా నిలుస్తుందని బ్రాండ్ ఫైనాన్స్ కొనియాడింది.

ప్రొఫెషనలిజమ్ తోనే....

లీగ్ లో తలపడుతున్న మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ కార్యకలాపాలను ప్రొఫెషనల్స్ పర్యవేక్షణలో కొనసాగిస్తూ ఉండటంతో అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లు తేలింది.

ఏడాది ఏడాదికీ ప్రమాణాలు మెరుగుపరచుకోడం, పటిష్టమైన జట్లతో బరిలోకి దిగడం దీనికి కారణమని పేర్కొంది. 2023 నుంచి 2027 కాలానికి.. మీడియా ప్రసారహక్కుల విక్రయం ద్వారా ఐపీఎల్ బోర్డుకు 6.02 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరండ ఓ రికార్డని పేర్కొంది.

ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఖతర్ ఏయిర్ వేస్ తో మూడేళ్లకు 75 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకోడం..బ్రాండ్ విలువ సత్తాకు నిదర్శనమని తేలింది.

రెండు కొత్త ఫ్రాంచైజీల చేరికతో....

ప్ర‌స్తుతం ఐపీఎల్ 17వ సీజ‌న్ పోటీలు వడివడిగా సాగిపోతున్నాయి. 17 సీజన్లుగా నిల‌క‌డ‌గా సాగుతున్న టోర్నీలో క్రికెట్‌కు, మైదానాల‌కు మ‌ధ్య చాలా సుదీర్ఘ అనుబంధం పెరిగింది. మ్యాచ్‌ల వ‌ల్ల ప్రేక్ష‌కుల‌కు వినోదం ల‌భిస్తుంటే, నిర్వాహ‌కుల‌కు ఆదాయం వస్తోంది. ప్ర‌తి మ్యాచ్ వారీగా గ‌ణిస్తే మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌లో ఐపీఎల్‌ను రెండో అతిపెద్ద లీగ్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు.

మ్యాచ్‌వారీగా మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ గ‌ణించినా ఐపీఎల్ బ్రాండ్ విలువ భారీగా పెరిగింది. రెండు కొత్త జ‌ట్లు చేర‌డంతో 2023లో ఐపీఎల్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌లో రూ.1.6 బిలియ‌న్ డాల‌ర్లు అదనంగా పెరిగింది. రెండు జ‌ట్లు కొత్త‌గా జ‌త క‌ల‌వడంతో ఐపీఎల్ టోర్నీలో నిర్వ‌హించే మ్యాచ్‌ల సంఖ్య 74 నుంచి 94కి పెరిగింది.

2008లో డీల్ ప‌రిమాణం 20 రెట్లు ఎక్కువ‌గా పెరిగింది. ఇప్పుడు ఐపీఎల్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.లక్ష వేల కోట్లు (10 బిలియ‌న్ డాల‌ర్ల కంటే ఎక్కువ‌). 2008లో ఒక యూనికార్న్ టోర్నీగా మొద‌లైన ఐపీఎల్‌.. ఇప్పుడు డెకాకార్న్‌గా అవ‌త‌రించింది. అంటే దాని విలువ ప‌ది బిలియన్ డాల‌ర్ల పై చిలుకే.

ఫ్రాంచైజీల విలువా పైకి పైకి...

ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం తమ బ్రాండ్ విలువను గణనీయంగా పెచుకొంటూ పోతున్నాయి. ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీ విలువ 83 మిలియ‌న్ డాల‌ర్ల‌తో అత్య‌ధిక బ్రాండ్ విలువ ప‌లుకుతోంది. ఆ త‌ర్వాతి స్థానంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 77 మిలియ‌న్ డాల‌ర్లు, చెన్నై సూప‌ర్ కింగ్స్ 74 మిలియ‌న్ డాల‌ర్లు, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ (ఆర్సీబీ) 68 మిలియ‌న్ డాల‌ర్లు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ 62 మిలియ‌న్ డాల‌ర్లతో ఉన్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై , చెన్నై ఫ్రాంచైజీలు అత్య‌ధికంగా చెరో ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకోగా, త‌ర్వాతి స్థానాలలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ రెండు, , రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, స‌న్ రైజ‌ర్స్ (డ‌క్క‌న్ చార్జ‌ర్స్‌), గుజ‌రాత్ టైటాన్స్ ఒక్కో సారి ట్రోఫీ గెలుచుకున్నాయి.

450 మిలియన్లకు చేరిన వీక్షకులు..

ప్రతి ఏటా భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదంగా ఉంటూ వస్తున్న ఐపీఎల్ వీక్షకులు సంఖ్య సైతం 450 మిలియన్ల సంఖ్యను చేరింది. ప్రస్తుత సీజన్ మొదటి 26 మ్యాచ్ లను 450 మిలియన్ల మంది వీక్షించడం ఓ అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.

ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించే సమయం కూడా 188 బిలియన్ నిముషాలకు చేరినట్లు బ్రాండ్ ఫైనాన్స్ విశ్లేషించింది.

భారత ఆర్థిక వ్యవస్థకు ఐపీఎల్ దన్ను..

భారత ఆర్ధికవ్యవస్థను బలోపేతం చేయడంలో ఐపీఎల్ తనవంతు పాత్ర పోషిస్తూ వస్తోంది. 2015లో ప్రభుత్వం వెలువరించిన నివేదిక ప్రకారం 11.5 బిలియన్ డాలర్లు భారత జీడీపీకి వచ్చి చేరింది.

2015 నుంచి 2023 మధ్యకాలంలో భారత ఆర్ధిక వ్యవస్థ కార్యకలాపాలలో ఐపీఎల్ పాత్ర అంతాఇంతా కాదు. భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావడంలో ఐపీఎల్ గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఐపీఎల్ రాబడితో క్రికెట్ అభివృద్ధి...

ఐపీఎల్ ద్వారా సమకూరే వేల కోట్ల రూపాయల రాబడిలో అధికమొత్తాన్ని దేశంలో క్రికెట్ మౌలికసదుపాయాల కోసం వెచ్చిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా చెబుతున్నారు.

దేశంలోనే మారుమూల ప్రాంతాలలో సైతం క్రికెట్ మౌలిక సదుపాయాల కల్పన కోసం బీసీసీఐ భారీ మొత్తాలలో నిధులు అందచేస్తున్నట్లు బీసీసీఐ వివరించింది.

First Published:  23 April 2024 9:35 AM GMT
Next Story