Telugu Global
Telangana

బీజేపీ.. ఓ భారీ వాషింగ్‌మెషిన్ - కేటీఆర్

ఆరోపణలు ఎదుర్కొంటూ బీజేపీలో చేరిన 25 మందిలో 10 మంది కాంగ్రెస్‌ నేతలు ఉన్నారని తెలిపింది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌. ఎన్సీపీ, శివసేన నుంచి నలుగురి చొప్పున బీజేపీ కండువా కప్పుకున్నారు.

బీజేపీ.. ఓ భారీ వాషింగ్‌మెషిన్ - కేటీఆర్
X

బీజేపీ.. ఓ భారీ వాషింగ్‌మెషిన్ అంటూ సెటైర్ వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీబీఐ, ఈడీ, ఐటీ అధికారుల పర్యవేక్షణలో ఇది పనిచేస్తుందంటూ ఓ ట్వీట్ చేశారు. 2014 నుంచి ఆరోపణలున్న బడా నేతలు బీజేపీలోకి చేరడం, వారికి కేసులు, విచారణ నుంచి ఎలా ఉపశమనం దొరికిందనే అంశంపై ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ రాసిన ఓ పరిశోధనాత్మక కథనాన్ని తన ట్వీట్‌కు జోడించారు కేటీఆర్.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. 2014 నుంచి అవినీతి విచారణను ఎదుర్కొంటున్న 25 మంది ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరారు. వారిలో 23 మంది కేసులు, విచారణ నుంచి ఉపశమనం పొందారు. ఇందులో ముగ్గురిపై కేసులు పూర్తిగా మూసివేయగా.. మరో 20 కేసుల్లో విచారణను తాత్కాలికంగా నిలిపివేసి కోల్డ్‌ స్టోరేజ్‌కు పంపినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసుకొచ్చింది.


ఆరోపణలు ఎదుర్కొంటూ బీజేపీలో చేరిన 25 మందిలో 10 మంది కాంగ్రెస్‌ నేతలు ఉన్నారని తెలిపింది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌. ఎన్సీపీ, శివసేన నుంచి నలుగురి చొప్పున బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు, సమాజ్‌వాదీ, వైసీపీ నుంచి ఒక్కో నేత బీజేపీ గూటికి చేరిపోయారని తన కథనంలో స్పష్టం చేసింది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌. ఈ జాబితాలో ఉన్న ఆరుగురు నేతలు ఈ ఏడాదే బీజేపీ కండువా కప్పుకోవడం విశేషం.

ఇక ఇప్పటికే ప్రతిపక్ష నేతలు బీజేపీ వాషింగ్‌మెషిన్‌లా తయారైందంటూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు బీజేపీ కండువా కప్పుకోగానే కేసుల విచారణ నిలిచిపోతుందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీలో చేరకపోతే ఈడీ, ఐటీ, సీబీఐ దాడులతో టార్గెట్‌ చేస్తున్నారంటున్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటూ బీజేపీలో చేరిన ప్రముఖ నేతల్లో మహారాష్ట్రకు చెందిన అజిత్ పవార్‌, అస్సాం సీఎం హిమాంత బిశ్వా శర్మ, బెంగాల్‌కు చెందిన సువేందు అధికారి, తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేష్, నవీన్ జిందాల్, కొత్తపల్లి గీత ఉన్నారు.

First Published:  4 April 2024 3:35 AM GMT
Next Story