Telugu Global
Telangana

కాంగ్రెస్‌ ఫ్రీ పవర్‌ హామీ.. ఖజానాపై భారం ఎంతంటే..!

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణలో కోటి 70 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కోటి 23 లక్షలు డొమెస్టిక్ కనెక్షన్లు కాగా.. 26.63 లక్షల కనెక్షన్లు వ్యవసాయానికి సంబంధించినవి ఉన్నాయి.

కాంగ్రెస్‌ ఫ్రీ పవర్‌ హామీ.. ఖజానాపై భారం ఎంతంటే..!
X

తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు.. రూ.81,516 కోట్ల అప్పుల్లో ఉన్నాయని కాంగ్రెస్‌ శ్వేతపత్రం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల్లో భాగంగా గృహజ్యోతి స్కీమ్‌ కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఇచ్చిన హామీ అమలు ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ స్కీమ్‌ ఇప్పటికే అమల్లో ఉండగా.. గృహా అవసరాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా అందిస్తామన్న కాంగ్రెస్‌ హామీతో రాష్ట్ర ఖజానాకు మొత్తంగా ఏటా 27 వేల కోట్ల 55 లక్షల రూపాయలు భారం పడుతుందని నిపుణుల అంచనా.

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణలో కోటి 70 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కోటి 23 లక్షలు డొమెస్టిక్ కనెక్షన్లు కాగా.. 26.63 లక్షల కనెక్షన్లు వ్యవసాయానికి సంబంధించినవి ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో యూనిట్‌ ధర రూ.5.10 పైసలుగా ఉంది. దీంతో కోటి 23 లక్షల వినియోగదారుల కోసం ప్రభుత్వం ఏటా రూ.15 వేల కోట్ల 55 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.12 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకూ తెలంగాణలో బీఆర్ఎస్ తీసుకువచ్చిన రైతుబంధు స్కీమ్‌ అత్యంత ఖర్చుతో కూడుకున్న పథకం. ఈ స్కీమ్‌ కోసం ఏటా 16 వేల కోట్లు ఖర్చయ్యేవి. అయితే ఇప్పుడు గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అంతకంటే ఖర్చుతో కూడుకున్నది. ఇందుకోసం ఏటా 27 వేల కోట్ల 55 లక్షల రూపాయలు అవసరం కానుండగా.. ఐదేళ్ల కాలానికి రూ.లక్షా 35 వేల 275 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే గృహజ్యోతి పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది.

First Published:  23 Dec 2023 5:24 AM GMT
Next Story