Telugu Global
Telangana

భార్య బర్త్‌డే వేడుకులు...తిరిగి వస్తుండగా దంపతుల దుర్మరణం

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులోని పెట్రోలుబంకు వద్ద.. ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతిచెందారు.

భార్య బర్త్‌డే వేడుకులు...తిరిగి వస్తుండగా దంపతుల దుర్మరణం
X

ఇద్దరికీ 30 ఏళ్లు కూడా నిండలేదు. రెండేళ్ల కిందటే పెళ్లయింది. ఎన్నో ఆశలు, మరెన్నో కలలు.. కానీ అవన్నీ ఒక్క రోడ్డు ప్రమాదంతో తుడిచి పెట్టుకుపోయాయి.

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులోని పెట్రోలుబంకు వద్ద.. ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతిచెందారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్‌రాజా (29), ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా విస్సన్నపేటకు చెందిన భార్గవి (27)లకు రెండేళ్ల కిందట పెళ్లయింది. ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. నవీన్‌రాజా విజయవాడ గూడవల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఫిజిక్స్‌ లెక్చరర్. భార్గవి సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్. శనివారం భార్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి నవీన్‌ ఆమెతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. శని, ఆదివారాలు ఆనందంగా గడిపిన సోమవారం ఉదయం 6 గంటలకు కారులో విజయవాడకు బయలుదేరారు. నవీన్‌ కారు నడుపుతుండగా.. పక్కసీట్లో భార్గవి కూర్చుంది.

మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామ శివారులో పెట్రోలుబంకు వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని.. వీళ్ల కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు టాప్‌ ఎగిరి పక్కనే ఉన్న బంకులో పడింది. భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. జేసీబీ, క్రేన్‌తో రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీయించారు పోలీసులు. జాతీయ రహదారి పక్కన కంటెయినర్‌ లారీని నిలిపి ఉంచడం వల్లే దంపతుల జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  23 April 2024 9:44 AM GMT
Next Story