Telugu Global
Telangana

పండగ వేళ పెను విషాదం.. - ఆటోను కారు ఢీకొనడంతో నలుగురు మృతి

వారు ప్రయాణిస్తున్న ఆటో మహబూబాబాద్‌ జిల్లా జమాండ్లపల్లి శివారులోని అర్బన్‌ పార్క్‌ సమీపానికి వచ్చేసరికి కొత్తగూడ మండలం గుజేండు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.

పండగ వేళ పెను విషాదం.. - ఆటోను కారు ఢీకొనడంతో నలుగురు మృతి
X

భోగి పండుగ వేళ పెను విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతిచెందినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్‌ శివారులోని ఆము తండాకు చెందిన కుటుంబంలోని ఇస్లావత్‌ శ్రీను(35), అతని తల్లి పాప (70), పిల్లలు రుత్విక్‌ (6), రుత్విక (4), వదిన శాంతి శనివారం సూర్యాపేట జిల్లా మిర్యాలపేటలోని గిరిజన ఆలయానికి వెళ్లారు. అక్కడ మొక్కులు చెల్లించుకున్న వీరు ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు.

వారు ప్రయాణిస్తున్న ఆటో మహబూబాబాద్‌ జిల్లా జమాండ్లపల్లి శివారులోని అర్బన్‌ పార్క్‌ సమీపానికి వచ్చేసరికి కొత్తగూడ మండలం గుజేండు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇస్లావత్‌ శ్రీను, తల్లి పాప, పిల్లలు రుత్విక్, రుత్విక ప్రాణాలు కోల్పోయారు. ఆటో డ్రైవర్‌ సర్దార్, వదిన శాంతి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

First Published:  15 Jan 2024 2:15 AM GMT
Next Story