Telugu Global
Telangana

ప్రచారానికే దూరం.. ప్రజల హృదయాలకు కాదు

కేసీఆర్‌ బస్సుయాత్రతో బయలుదేరితే కాంగ్రెస్‌, బీజేపీవాళ్లు గజగజ వణుకుతున్నారని, అందుకే భయంతో ప్రచారాన్ని ఆపాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు.

ప్రచారానికే దూరం.. ప్రజల హృదయాలకు కాదు
X

తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి, 4 నెలల్లో ప్రజలకు ఇచ్చింది కూడా గాడిద గుడ్డేనని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 100 రోజుల్లో హామీల అమలు అని మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పై కోపంతో బీజేపీకి ఓటు వేయొద్దని, అదే జరిగితే పెనం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇంకా ఆగం అవుతామని పేర్కొన్నారు. ఎప్పటికైనా బీఆర్‌ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు హరీష్ రావు.


వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు, నీరు లేక పంటలు ఎండిపోయిన రైతులకు.. పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కేసీఆర్‌ గట్టిగా అడుగుతున్నందుకే ఆయనపై కక్షగట్టి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి ప్రచారాన్ని ఆపివేయించారని అన్నారు హరీష్ రావు. రెండు రోజులు ప్రచారాన్ని ఆపినా, తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం కేసీఆర్‌ ఎప్పటికీ నిలిచి ఉంటారని స్పష్టం చేశారు. ఆయన్ను ప్రచారానికి దూరం చేయగలరేమో కానీ, తెలంగాణ ప్రజల హృదయాల నుంచి మాత్రం దూరం చేయలేరన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

కేసీఆర్‌ బస్సుయాత్రతో బయలుదేరితే కాంగ్రెస్‌, బీజేపీవాళ్లు గజగజ వణుకుతున్నారని, అందుకే భయంతో ప్రచారాన్ని ఆపాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. రుణమాఫీ ఎప్పుడు, వడ్లకు బోనస్‌ ఎప్పుడు, అక్క చెల్లెళ్లకు రూ.2,500, అవ్వాతాతలకు రూ.4 వేల పింఛను ఎందుకు ఇవ్వట్లేదని కేసీఆర్ అడుగుతుంటే.. బదులు చెప్పే ధైర్యం లేక.. చెడ్డీ ఊడగొడతానంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చిన పెద్దాయనను పట్టుకొని అలా అనొచ్చా అని నిలదీశారు. సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి అని ప్రశ్నించారు హరీష్ రావు.

First Published:  2 May 2024 3:42 AM GMT
Next Story