Telugu Global
Telangana

మైనార్టీలకు అండగా ఉన్నాం.. ఇఫ్తార్ విందులో కేటీఆర్

కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 1,32,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. పేద మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ను కూడా తమ ప్రభుత్వ హయాంలో అందజేశామని పేర్కొన్నారు కేటీఆర్.

మైనార్టీలకు అండగా ఉన్నాం.. ఇఫ్తార్ విందులో కేటీఆర్
X

గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా మత కల్లోలాలు, అల్లర్లు జరిగినా.. కేసీఆర్ పాలనలో మాత్రం అన్ని మతాల వారు కలసి మెలసి ఉన్నారని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశం అభివృద్ధి కావాలన్నా.. దేశంలో శాంతి నెలకొనాలన్నా కేసీఆర్ లాంటి నేత చాలా అవసరం అని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన పల్లి వినోద్, స్థానిక బీఆర్ఎస్ నేతలు, మైనార్టీ నాయకులతో కలసి కేటీఆర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.


కేసీఆర్ ప్రభుత్వం ఏరోజూ మతం పేరుతో రాజకీయం చేయలేదని, కులం పేరుతో ఓట్లు అడగలేదని చెప్పారు కేటీఆర్. పేదవాడు ఏ మతస్తుడైనా, ఏ కులస్తుడైనా కూడా మనిషిలాగానే చూడాలనేది కేసీఆర్ భావన అని.. తెలంగాణలో అన్ని మతాలవారికి కావాల్సిన వసతులు కేసీఆర్ అందించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 1,32,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. పేద మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ను కూడా తమ ప్రభుత్వ హయాంలో అందజేశామని పేర్కొన్నారు కేటీఆర్.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కేటీఆర్ పర్యటించారు. సారంపల్లిలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. పంటల నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని అన్నారు. తెలంగాణలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్‌ తెచ్చిన కరువన్నారు కేటీఆర్‌.



First Published:  28 March 2024 4:36 PM GMT
Next Story