Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో ఆర్ఎస్ఎస్‌ చిచ్చు..!

బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆర్ఎస్ఎస్ పారషూట్‌కు హటావో.. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌కు బచావో అంటూ బ్యానర్ ప్రదర్శించి నిరసన తెలిపారు.

కాంగ్రెస్‌లో ఆర్ఎస్ఎస్‌ చిచ్చు..!
X

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఆర్ఎస్ఎస్‌ చిచ్చు పెట్టింది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్‌, ఎంఐఎం నేతలు సైతం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్‌ ఏజెంట్‌ అంటూ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో ఆర్ఎస్ఎస్‌ నుంచి వచ్చినవారికి పెద్దపీట వేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్‌లోనూ ఇదే సీన్ రిపీట్‌ అయింది. బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆర్ఎస్ఎస్ పారషూట్‌కు హటావో.. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌కు బచావో అంటూ బ్యానర్ ప్రదర్శించి నిరసన తెలిపారు.

రెండు రోజుల క్రితం ఎంఐఎం నాయ‌కులు అక్బరుద్దీన్, అసదుద్దీన్‌ ఓవైసీ సైతం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్‌ కార్యకర్త అంటూ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి తాను ఆర్ఎస్ఎస్‌ మనిషిని కాదని భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మొదటి నుంచి రేవంత్‌ రెడ్డిని ఇదే అంశంపై టార్గెట్ చేస్తూ వచ్చారు. గాంధీ భవన్‌లోకి గాడ్సే వచ్చాడంటూ రేవంత్‌పై సెటైర్లు వేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి మళ్లీ బీజేపీలో చేరడం ఖాయమని కేటీఆర్ ఆరోపించారు.

స్వయంగా ఆర్ఎస్ఎస్‌ కార్యకర్త అయిన రేవంత్ రెడ్డి.. ఆర్ఎస్ఎస్‌ నేపథ్యం ఉన్న నాయకుల నుంచి కోట్ల రూపాయలు తీసుకుని టికెట్ హామీలు ఇస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీగా నియమించిన టైంలో పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సైతం సోనియాగాంధీకి లేఖ రాశారు. ఆర్ఎస్ఎస్‌ నేపథ్యం ఉన్న వ్యక్తికి రాష్ట్ర పగ్గాలు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.


First Published:  7 Oct 2023 6:36 AM GMT
Next Story